రాజన్న సిరిసిల్ల, జూలై 24(నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల టౌన్, జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్డే సందర్భంగా ప్రభుత్వ విద్యార్థులకు అధునాతన బోధన అందించాలనే సంకల్పంతో అరుదైన కానుక అందజేశారు. ఇప్పటికే సిరిసిల్ల గీతానగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ప్రైవేట్ స్కూల్కు దీటుగా అభివృద్ధి చేసిన ఆయన, ప్రత్యేక చొరవతో గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10లక్షల విలువైన ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబో (టీచర్)ను అందించారు. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోబోను హ్యూమనాయిడ్ ల్యాబ్ ప్రతినిధులు, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరు ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, పాఠశాల హెచ్ఎం లోకిని శారద, ఉపాధ్యాయులతో కలిసి నాఫ్స్కాబ్ కొండురు రవీందర్రావు ఆవిష్కరించారు.
త్వరలోనే దీనితో బోధన చేయించనున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోబో టీచర్ను అందుబాటులోకి తేగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. కేటీఆర్కు బర్త్డే విషెస్ తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్కు దీటుగా అభివృద్ధి చేశారని చెప్పారు. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, క్రీడా వసతులు వంటి అనేక సౌకర్యాలు కల్పించారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలోనే తొలిసారిగా రోబో టీచర్ను సిరిసిల్ల విద్యార్థులకు కానుకగా అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు బొల్లి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ గొప్ప మానవతావాది. ఆయన దూర దృష్టి అమోఘం. కేటీఆర్ ఏకార్యక్రమం తీసుకున్న సిరిసిల్ల నుంచి మొదలుపెట్టడం సిరిసిల్ల ప్రజల అదృష్టం. తెలంగాణలోనే తొలి హ్యుమానాయిడ్ టీచర్ (రోబో)ను అందించడం చాలా గొప్ప విషయం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సిరిసిల్లలో అత్యాధునిక వసతులతో పాఠశాల భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు తన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు టెక్నాలజీతో కూడిన ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో రోబో టీచర్ను అందించారు. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు ఈ రోబో టీచర్ను సద్వినియోగం చేసుకోని ఉత్తమ ఫలితాలు సాధించాలి.