తెలంగాణలో అందుకు అనుకూల వాతావరణం
నిజాం కాలేజీ ఆధునీకరణకు 15 కోట్లు ఇస్తం
ఉద్యోగ ప్రకటన రోజే గ్రాడ్యుయేషన్ డే సంతోషకరం
మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9: యువత వ్యాపారవేత్తలుగా రాణించాలని, ఇందుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. భవిష్యత్తుపై సృష్టమైన అవగాహన, లక్ష్యంతో ఉండాలని.. గొప్ప ఆలోచనలు, పట్టుపదలతో ప్రయత్నిస్తే లక్ష్య సాధన సులువవుతుందని చెప్పారు. బుధవారం నిజాం కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తాను నిజాం కళాశాల పూర్వ విద్యార్థినని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు. కళాశాల కోసం పూర్వ విద్యార్థిగా తనవంతుగా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఉన్నదని వెల్లడించారు. ఇందులో భాగంగానే రూ.8 కోట్లను వెచ్చించి బాలికల వసతి గృహాన్ని నిర్మించామని తెలిపారు. నిజాం కాలేజీ అభివృద్ధికి అవసరమైతే మరో రూ.15 కోట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు.
కాలేజీని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తారని పేర్కొన్నారు. నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే జరుగుతున్న రోజే ప్రభుత్వం 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రకటన చేయడం సంతోషకరంగా ఉన్నదని చెప్పారు. గత ఏడున్నరేండ్లలో తెలంగాణలో వేలాది పరిశ్రమలు ఏర్పాటయ్యాయని.. యువత ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. నేటి విద్యావంతులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.