హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇస్తామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనివల్ల కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఇండ్ల స్థలాలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సోమవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బీఆర్కే భవన్లో సమావేశమైంది. మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. అర్హులకు ఇండ్ల స్థలాల కేటాయింపు, జీవో 58, 59, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్/వక్ఫ్ భూములు తదితర అంశాలపై చర్చించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. 2014లో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. జీవో 58 కింద 20,685 ఇండ్లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఇంటి స్థలాల పట్టాల జారీని వేగవంతం చేయాలని అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. నోటరీ చేసిన పత్రాల గురించి ప్రస్తావిస్తూ.. పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని, పేదలకు అనుకూలమైన విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. అన్ని కేసులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్, రామకృష్ణారావు, అర్వింద్ కుమార్ పాల్గొన్నారు.