హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): దళిత, గిరిజన సామాజికవర్గాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలను ఏర్పాటు చేయదల్చుకొన్న ఔత్సాహికుల దరఖాస్తులను ప్రతినెలా పరిశీలించి అర్హతలకు అనుగుణంగా వాటిని త్వరగా పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. లబ్ధిదారులు వాహనాల కొనుగోలుకు బదులుగా పరిశ్రమలను ఏర్పాటుచేసి మరో నలుగురికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సౌకర్యార్థం హైదరాబాద్లోని సైఫాబాద్లో డిక్కీ (దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మాడల్ కెరీర్ సెంటర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. టీ-ప్రైడ్ పథకం ద్వారా ఇప్పటివరకు ఎస్సీలకు చెందిన 21,500 యూనిట్లకు రూ.1,005 కోట్లు, ఎస్టీలకు చెందిన 25,560 యూనిట్లకు రూ.1,133 కోట్ల ప్రోత్సాహకాలను అందజేసినట్టు తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ద్వారా ఎక్కువమంది వాహనాలు, ట్రాక్టర్లు తీసుకొంటున్నారని, దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. వీటికి బదులుగా పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టాలని సూచించడంతో లబ్ధిదారుల్లో పలువురు రైస్మిల్లులు, డెయిరీ యూనిట్లు, స్టోర్లు పెడుతున్నట్టు చెప్పారు. దళితబంధులో భాగంగా జమ్మికుంటకు చెందిన 30 మంది యువకులు సమిష్టిగా ఫ్యాబ్రికేషన్ యూనిట్, సోడా మేకింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చారని, దీంతో వారికి భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అనేక చర్యలు
ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వివరించారు. టీఎస్ఐఐసీ లేఅవుట్లలో ఆ వర్గాలకు ప్లాట్లను రిజర్వు చేస్తున్నామని, ‘ఉద్యమిక’ పథకం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని చెప్పారు. టీఎస్ఐఐసీ అభివృద్ధి చేస్తున్న లేఔట్లలో ఎస్సీ, ఎస్టీలకు భూమి విలువలో 50% రాయితీ ఇవ్వడంతోపాటు మిగిలిన మొత్తాన్ని 8 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నామని, వారు చెల్లించే వడ్డీని 12% నుంచి 4 శాతానికి తగ్గించామని తెలిపారు.
ఆ కార్యక్రమాలు, పథకాలు పాతవే..
ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు కొత్తవేమీ కాదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 1985లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సిద్దిపేటలో హరితహారం ద్వారా 10 వేల మొక్కలు నాటించారని, సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా దానయ్య అనే దళితుడిని నియమించారని తెలిపారు. ‘దళిత చైతన్య జ్యోతి’ పేరుతో 1988-89లోనే దళితబంధు లాంటి కార్యక్రమాన్ని, ‘మంచినీళ్ల పండుగ’ పేరుతో 1995-96లోనే ‘మిషన్ భగీరథ’ను అమలు చేశారని వివరించారు.
లంచాలకు తావులేకుండా టీఎస్ ఐపాస్
టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా రూ.2.35 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని, 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ లంచాలకు తావులేకుండా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులు జారీ అవుతాయని, లేనిపక్షంలో 16వ రోజు డీమ్డ్ అప్రూవల్ కింద పరిగణించడంతోపాటు జాప్యానికి కారణమైన అధికారులకు జరిమానా విధిస్తామన్నారు.
నిరుద్యోగులకు ఊతం
ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు పారిశ్రామికరంగం ఎంతో కీలకమైనదని, అందుకే ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సంకల్పించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు సొంత కాళ్లపై నిలబడేలా నిరుద్యోగులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తున్నదన్నారు. డిక్కీ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లానింగ్ నుంచి ప్రభుత్వ సహకారం ఇప్పించే వరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుండటం సంతోషదాయకమన్నారు.