పెద్దపల్లి : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula ) అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అజేయ శక్తి గా ఎదుగుతున్న పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
దేశం అభివృద్ధిపై కేసీఆర్ మార్క్ ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని అన్నారు .
కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇది హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లోను రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం జరిగిందని అన్నారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం గా నిలుస్తుందన్నారు. విజన్ గల నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.