ధర్మారం, జూలై 10: పైసా నిధులు ఇవ్వకపోవడమే కాకుండా.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే మాడల్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై ప్రధాని మోదీ విమర్శలు ఎలా చేస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం మంత్రి ఈశ్వర్ పర్యటించారు. నంది మేడారం గ్రామంలో రెండో విడుతలో 24 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. అదే గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించే సైడ్ లైటింగ్ సిస్టం పనులను ప్రారంభించారు.
దొంగతుర్తి గ్రామంలో దొంగతుర్తి -కుమ్మరికుంట గ్రామాల మధ్య రూ.4 కోట్ల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. దొంగతుర్తి, రచ్చపల్లి, రామయ్యపల్లి గ్రామాల్లో జీపీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దొంగతుర్తి గ్రామంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల రాష్ర్టానికి వచ్చిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై చేసిన ఆరోపణలను ఖండించారు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా విమర్శించడమేంటని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అయిన ఖర్చు కంటే ఎక్కువ అవినీతి జరిగిందని రాహు ల్ గాంధీ ఆరోపించడం అవివేకమని విమర్శించారు. విపక్ష నేతలు ఎన్ని విమర్శలు చేసినా రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్కే అండగా ఉంటారని మంత్రి ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.