ధర్మారం, సెప్టెంబర్ 19: స్వరాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సమాజంలో ప్రజలంతా గౌరవప్రదంగా జీవించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్తగా పింఛన్ మంజూరైన 1,783 మంది లబ్ధిదారులకు సోమవారం ఆయన పత్రాలు, ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, కొనసాగుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.