Ambedkar Statue | దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం పరిశీలించారు. విగ్రహావిష్కరణకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రితోపాటు వీవీఐపీలు పాల్గొనే విగ్రహావిష్కరణకు ఉపయోగించే కర్టెన్, సందర్శకులకు ప్రవేశం, బహిరంగ సభ నిర్వహణ స్థలం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రులు సమీక్షించారు.
ఐమాక్స్ పక్కనే ఉన్న మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు దాదాపు 40వేలకుపైగా కుర్చీలు వేయించాలని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్, విగ్రహావిష్కరణ అనంతరం, అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించనున్నందున క్యూలైన్లు, పూలు ఏర్పాటు చేయాలని కోరారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎస్సీ డెవలప్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్పీ డెవలప్మెంట్ శాఖ కమిషనర్ యోగితా రానా, మల్లేపల్లి లక్ష్మయ్య ఆర్అండ్బీ అధికారులు పరిశీలించారు. కాగా, విగ్రహా ఆవిష్కరణకు సంబంధించి తుది మెరుగులు దిద్దుతున్నారు.