Minister Koppula Eshwar | అణగారిన వర్గాలను కేంద్ర ప్రభుత్వం అవమానపరిచిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్రం బడ్జెట్పై మంత్రి స్పందించారు. బడ్జెట్లో ఎస్సీలకు రూ.15వేలకోట్లు, ఎస్టీలకు రూ.15వేల కోట్లు, బీసీలకు రూ.1400కోట్ల మాత్రమే కేటాయించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.38వేలకోట్లు ఎస్సీల అభ్యున్నతి కి ఖర్చు చేస్తుంటే, దేశవ్యాప్తంగా రూ.15వేలకోట్లు కేటాయించడం సిగ్గుచేటన్నారు. మోదీ పాలనలో వివక్ష కొనసాగుతుందనేందుకు కేంద్ర బడ్జెట్ నిదర్శనమన్నారు. రైతు, ఉద్యోగులు, ఉపాధి హామీ కూలీలకు బడ్జెట్ వ్యతిరేకమన్నారు. కార్పోరేట్లకు కొమ్ము కాసే విధంగా బడ్జెట్ ఉదని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయంతోపాటు ఇతర రంగాలను పట్టించు కోనేలేదన్నారు.
దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసే విధంగా బడ్జెట్ ఉందని, రాష్ట్రాలను కేంద్ర బడ్జెట్ ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు. విద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదని, ముఖ్యంగా తెలంగాణకు మొండిచేయి చూపించిందన్నారు. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని, ఎన్నికలున్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించారని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విస్మరించారన్నారు. మాటలు కోటలు తప్ప.. నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లేదన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాటలేదని, గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారని, ఆహార సబ్సిడీలు తగ్గించారన్నారు.
ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీ లేదన్నారు. జీఎస్టీ రూపంలో దేశ ఉత్పత్తి, సేవా పన్నుల రూపంలో ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నామని కేంద్రం చెబుతున్నా, ఈ విధానాలు కేవలం కార్పోరేట్, సంపన్న వర్గాలకు మాత్రమే మేలు చేకూర్చే విధంగా ఉన్నాయే తప్ప.. సంపద సృష్టిస్తున్న బడుగు జీవులకు ఒరిగిందదేమి లేదన్నారు. దేశంలో కులవృత్తులనే నమ్ముకుని జీవనం కోనసాగిస్తున్న వారి పరిస్థితులు రోజు రోజుకు దయనీయంగా మారుతున్నాయన్నారు. వంట నూనెలు, పెట్రోల్, డీజిల్తో పాటు ఇతర నిత్యవసర ధరలు పెరగడంతో మధ్య తరగతి వర్గాల ఆక్షలు గల్లంతయ్యాయన్నారు.