ధర్మారం, ఆగస్టు 29: కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను రాష్ట్రంలోని దళిత, గిరిజనులు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు, న్యూ కొత్తపల్లి, చామనపల్లి, నంది మేడారం, ధర్మారం మండల కేంద్రంలో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో జరిగిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాంగ్రెస్ తరఫున చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఒట్టి బూటకమేనని మండిపడ్డారు.
అధికారం కోసం తప్పుడు ప్రకటనలు చేస్తూ, దళితులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, గిరిజనుల కోసం కోసం కాంగ్రెస్ ఎన్ని ప్రకటనలు చేసినా వారిని ఆ సామాజిక వర్గాలు నమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే దళిత బంధు ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. విదేశాల్లో దళిత, గిరిజనులు చదువుకోవడానికి అంబేదర్ ఓవర్సీస్ పథకం ద్వారా రూ.20 లక్షల సాయం అందిస్తున్నామని గుర్తుచేశారు. గతంలో కంటే రాష్ట్ర ప్రభు త్వం దళిత, గిరిజనుల కోసం గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసి వారి విద్యాభ్యాసానికి తోడ్పాటునందిస్తున్నదని చెప్పారు.