హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఎవరికి ఎవరు ‘బీ’ టీం అనేది ప్రజలందరికీ తెలుసునని, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ అరెస్ట్ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బీజేపీకి కాంగ్రెస్ ‘బీ’ టీం కాబట్టే హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బలహీన అభ్యర్థులను నిలబెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడకుండా.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్తో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో రాహుల్గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయ మీడియా సెంటర్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి రాహుల్గాంధీ మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. మూడేండ్ల రికార్డు సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. అలాంటి ప్రాజెక్టుపై రాహుల్గాంధీ అడ్డగోలుగా మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వకుండా తెలంగాణలో 4 వేల పింఛన్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఇప్పటికే రాష్ట్రంలో పోడు భూముల పంపిణీ కొనసాగుతున్నదని, అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు పంపిణీ చేస్తామనడం రాహుల్ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించారు.