ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ఎస్సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇదంతా రైతులు, వెనుకబడిన వర్గాలు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు, చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారి ప్రయోజనాలు దెబ్బతీయడంలో భాగమే అన్నారు. ఎల్ఐసీ, రైల్వే, టెలిఫోన్ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ వస్తున్న కేంద్రం.. వ్యవసాయ రంగం, కోళ్ల పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలపై ఆధారపడి జీవనం చేసుకునే వారిని కూడా వదలటం లేదని ఆరోపించారు.
ఏ పెద్దల మెప్పుకోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్కో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్ సరఫరా చేసినట్టు కేంద్రం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు. కొత్తగా విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి ఆరోపించారు.
బండి పాదయాత్ర ఎందుకు?
బీజేపీ నేత బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర దేనికోసమని సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల రద్దు కోసమే అయి ఉంటుందని ఆయన ఎద్దేవాచేశారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో కళ్యాణాలక్ష్మి/షాదీ ముబారక్, ఆసరా ఫించన్లు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, అన్నింటికీ మించి రైతు బంధు, రైతు భీమా వంటి పధకాలు లేకపోవడంతో అక్కడి ప్రజలు బీజేపీ నేతలను నిలదీస్తుండటంతో తట్టుకోలేకనే ఇక్కడ కుడా ఎత్తి వేయాలన్నది ఆ పార్టీ వ్యూహం అయి ఉండొచ్చన్నారు.
ఇప్పటికే మూడు సార్లు పాదయాత్ర జరిపిన ఆయనగానీ, ప్రచార పటాటోపంతో పబ్లిసిటీ కోసం ఢిల్లీ నుండి తరలి వస్తున్న నేతలుకానీ ఇక్కడి ప్రజలకు ఏంచేస్తారు అన్నది చెప్పలేక పోయారని ఆయన ఎత్తి పొడిచారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రంగాలకు విద్యుత్ అందించడంతో పాటు దేశంలోనే ఎక్కడా లేని విదంగా వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ను ఎత్తివేసేందుకే బండి పాదయాత్ర జరుగుతున్నట్లుందన్నారు. అందుకే ప్రధాని మోడీ సొంత రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టేందుకు బీజేపీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని ప్రజలపై ఒత్తిడి చేయడమే బండి పాదయాత్ర అసలు సారాంశం అని ఆయన పేర్కొన్నారు.