సభలో 2 వేల మంది దళితులకు దళిత బంధు పంపిణీ
మిగతా 20 వేల మందికి మరుసటి రోజు నుంచి
సభకు వచ్చే వారికి అందుబాటులో భోజనం, మంచినీళ్లు
జమ్మికుంట : ఈ నెల 16న జమ్మికుంట వేదికగా జరగబోయే దళిత బంధు సభా వేదిక ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆ రోజున 2 వేల మందికి దళిత బంధు చెక్కులను పంపిణీ చేసి, మరుసటి రోజు నుంచి మరో 20 వేల మందికి పంపిణీ చేస్తామన్నారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున.. అందరికీ భోజనం, మంచినీళ్ల సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సభకు దళితులను తీసుకొచ్చేందుకు 825 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. సభను విజయవంతం చేయాలని దళితులకు మంత్రి కొప్పుల విజ్ఞప్తి చేశారు.
ఈ సభకు దళిత వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇప్పటికే దళిత బంధుపై దళిత ప్రజాప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలు కోసం రూ. 500 కోట్లను సీఎం కేసీఆర్ విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని ఒక ఉద్యమం మాదిరిగా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని,ఇందుకు సంబంధించి సర్వే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది 119 నియోజకవర్గాలలో 100 కుటుంబాల చొప్పున సుమారు 12వేల కుటుంబాలకు దళిత బంధును అమలు చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.