హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ తీరంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఏప్రిల్ 5లోగా పూర్తిచేయాలని అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్న ఈ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఏప్రిల్ 14న ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల బుధవారం ఆ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. గడువులోగా అన్ని పనులను పూర్తిచేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని, అందుకు సరిపడా మ్యాన్ పవర్ను పెంచాలని అధికారులకు సూచించారు.