హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రైతుల ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ఇకనైనా చిల్లర చేష్టలు మానుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం పోసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని స్పష్టంచేశారు.
కమలాపూర్లో 20 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఒక రైతుకు చెందిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలకే పరిమితమయ్యారు తప్ప ప్రజలకు ఏది అవసరమో ఏనాడూ గుర్తించలేదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ మాత్రమే రైతులకు ఉచిత విద్యుత్తుతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటున్నారని కొనియాడారు. అలాంటి ప్రభుత్వంపై విమర్శలు తగవని అన్నారు. కొందరు తప్పుడు ప్రచారంతో ప్రజలను పక్కదోవ పట్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, వారికి ప్రజలే తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.