Minister Koppula Eshwar | ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారన్నారు. అయినా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయాలు చేయడంపై మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధికోసమే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో పోటాపోటీ పాదయాత్రలు చేస్తున్నారని, భట్టి పాదయాత్ర హైలెట్ కాకుండా.. రేవంత్ రెడ్డి ఆధారాలు లేకుండా కేటీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
పేపర్ లీకేజీపై ప్రభుత్వానికి విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నిందితులు ఇప్పటికే జైలులో ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం సిట్ను సైతం ఏర్పాటు చేసిందన్నారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పే తప్ప.. స్కామ్ కాదన్నారు. 2010లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-1 పేపర్ లీకయితే.. ఐటీ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య, అప్పటి సీఎం రోశయ్య రాజీనామా చేశారా? కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. 2010లో యూపీపీఎస్సీపై ఆరోపణలు వస్తే ప్రధాన మంత్రి రాజీనామా చేశారా? అని నిలదీశారు. కర్ణాటకలో ఎస్సై ఉద్యోగాల భర్తీ విషయంలో ఆరోపణలు వస్తే అక్కడి బీజేపీ సీఎం రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.
యూపీలో సైతం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఆరోపణలు వచ్చాయన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.
ప్రతిపక్షాలు అర్థం లేకుండా మాట్లాడుతున్నాయన్నారు. దేశంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టి వెళ్లిన వారు మోదీ చుట్టాలేనా? అని ప్రశ్నించారు. కేటీఆర్కు వస్తున్న ఆదరణను తగ్గించేందుకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి పని చేస్తుందని, సిట్ పారదర్శకంగా విచారణ జరుపుతుందన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరికీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.