Minister Koppula Eshwar | ప్రకృతి ప్రకోపంతో పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేందుకు ఎకరానికి రూ.10వేల పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా గొలపల్లి మండలం చందోలిలో మంత్రి మాట్లాడుతూ.. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు ఆత్మస్థయిర్యం కోల్పోయారని, సీఎం కేసీఆర్ పంట పొలాలను పరిశీలించి వారిలో ధైర్యం నింపారన్నారు. పంటలను పరిశీలించి ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం ప్రకటించారన్నారు. అప్పటికప్పుడు 2.22లక్షల ఎకరాలకు పంట పరిహారాన్ని విడుదల చేస్తూ జీవో జారీ చేశారన్నారు. గతంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న సమయంలో ఏ ప్రభుత్వాలు రైతులకు సాయం అందించిన దాఖలు లేవన్నారు.
మొక్కజొన్న పంట నష్టపోతే ఎకరానికి రూ.3వేల వరి నష్టపోతే ఎకరాన రూ.5వేలు పరిహారం ఇస్తూ వచ్చారన్నారు. అది కూడా పంట రుణం తీసుకునే సమయంలోనే, మరో పంట వేసే సమయంలోనో ఇన్ఫుట్ సబ్సిడీగా అందజేస్తూ వచ్చేవారన్నా. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోను ఇదే తంతు కొనసాగుతుందని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పద్ధతిని అవలంభించాయని గుర్తు చేశారు. ఈ అసంబద్ధ పద్ధతిని కాదని, సీఎం కేసీఆర్ తొలిసారిగా రైతుల్లో ఆత్మస్థయిర్యం నింపేందుకు ఎకరానికి పంటనష్టం రూ.10వేలు పరిహారం ప్రకటించడంతో పాటు, నిధులు విడుదల చేయడం చాలా గొప్పవిషయం అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతుందన్నారు.
పంటనష్ట పోయిన రైతులను సీఎం కేసీఆర్ కలిసిన సమయంలో పంటనష్టం తమకు ఇబ్బంది కలిగిస్తుందని, అయితే సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం తీసుకువచ్చిన పథకాల నేపథ్యంలో ఈ కాస్త నష్టాన్ని తాము భరించేందుకు సిద్ధంగా ఉన్నామని, రైతులు చెప్పారన్నారు. స్వయంగా తమను కలిసి తమలో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు, పరిహారం ప్రకటించడంపై ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. దీన్ని జీర్ణించుకోలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా పంట నష్టపోయిన రైతులకు పరిహారం కింద ఎకరానికి రూ.10వేలు ఇస్తుందా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై సరిగా స్పందించడం లేదని, ప్రభుత్వ పాలసీ సరిగా లేదని, పంటనష్టం వివరాలను ఇచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గతంలో ఇచ్చినా రూపాయి ఇవ్వలేదని, కేవలం కేంద్ర ప్రభుత్వం రాజకీయం మాత్రమే చేస్తుందని మండిపడ్డారు. పంటనష్టం వివరాలను కేంద్రానికి ఇవ్వడం కూడా దండగా అన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా ఈ సారి పంట నష్టం వివరాలను కేంద్రానికి ఇవ్వమని సీఎం కేసీఆర్ వివరాలు ఇవ్వడం లేదన్నారు. స్వరాష్ట్రం సాధించిన తదుపరి రెండు మార్లు ప్రకృతి వైపరిత్యం వల్ల అకాల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయని, రెండు సార్లు పంట నష్టం వివరాలను కేంద్ర ప్రభుత్వంకు అందజేసినా, ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దేశంలో వ్యవసాయం, రైతాంగం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో నూతన పాలసీని రూపొందించే సత్తా సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. త్వరలోనే దేశంలోనే రైతుల మేలు కోసం కొత్తవ్యవసాయ పాలసీ వస్తుందని, రాజ్యమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.