Koppula Eshwar | గోదావరిఖని : సింగరేణి( Singareni ) సంస్థను ప్రైవేటీకరణ చేసే అంశంపై, బొగ్గు బ్లాకులను వేలం వేసే విషయమై ప్రధాని మోదీ( PM Modi ) స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఆందోళనలు చేపడుతూనే ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula Eshwar ) స్పష్టం చేశారు. గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు.
శనివారం తెలంగాణ రాష్ర్టానికి వస్తున్న ప్రధాని మోదీకి సింగరేణి కార్మికుల నిరసన సెగ తాకేలా తలపెట్టిన మహాధర్నాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సింగరేణిపై ప్రతి సందర్భంలోనూ విషం కక్కుతూ ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్నదని, సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నదని, దీనిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
వందలాది కోట్ల రూపాయల లాభాల్లో కొనసాగుతూ కార్మికులకు 30 శాతం లాభాల వాటా, ఇతర అన్ని వసతులు కల్పిస్తూ ముందుకు సాగుతున్న సంస్థను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఏదైనా పరిశ్రమను ప్రైవేట్పరం చేయాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయని, భారీ నష్టాల్లో ఉండడం, కార్మికులకు జీతాలు, ఇతర సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో ఉంటే వాటిపై ఆలోచన చేసి ప్రైవేట్పరం చేస్తారని, అందుకు భిన్నంగా ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కార్మికుల కష్టంతో సాగుతున్న సింగరేణిని ప్రైవేట్కు అప్పగించే కుట్ర చేస్తున్న కేంద్రం వైఖరి ఆక్షేపనీయమన్నారు. సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు బ్లాకులను ప్రైవేట్కు అప్పగించే కుట్రలో భాగంగా ప్రతిసారి వేలం ప్రక్రియను చేపడుతున్న నరేంద్రమోదీకి బుద్ధి చెప్పేలా అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ రామగుండం పర్యటనకు నవంబర్ 12న వచ్చిన సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ చేయబోమని చెప్పాడని, ఇప్పుడేమో వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు బొగ్గు బ్లాకులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని కాపాడే పనిలో ఉన్నాడని, సింగరేణికి ఏం జరిగినా అడ్డుకునే సత్తా కేవలం కేసీఆర్కే ఉందని, ఆయనకు అండగా ఉండి సంస్థను కాపాడుకుంటామన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న అనేక సంస్థలను ప్రైవేట్కు అప్పగించారని ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను అమ్మేశారని, సింగరేణిపై వేలు పడితే మాత్రం ఊరుకోమని ఆయన హెచ్చరించారు. గోదావరిఖని పట్టణంలో శనివారం జరిగే మహాధర్నాకు పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజలను తీసుకువచ్చి నిరసన గళం తెలంగాణకు వస్తున్న మోదీకి వినిపించేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య, జావిద్పాషా, ఎల్.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.