పెద్దపల్లి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): తెలంగాణలో పుష్కలంగా ఉన్న సింగరేణి బొగ్గు టన్ను రూ.4 వేలకే లభిస్తుండగా.. అదానీ వద్ద టన్ను బొగ్గును రూ.24 వేలకు కొనాలని ప్రధాని మోదీ చెప్పడం సిగ్గుచేటని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని దుయ్యబట్టారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో రామగుండం నియోజకవర్గంలోని 259 పోలింగ్ బూత్ కమిటీల బీఆర్ఎస్ కన్వీనర్, కో-కన్వీనర్, ఇన్చార్జ్ల ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. తెలంగాణలో పుష్కలంగా బొగ్గు అందుబాటులో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో అదానీ ఉత్పత్తి చేస్తున్న బొగ్గును కొనాలని కేంద్రం చెప్పడంలో మతలబు ఏంటో దేశ ప్రజలకు తెలియజేయాలని, రూ.24 వేలల్లో ప్రధాని వాటా ఎంతో బీజేపీ నాయకులే చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.