ధర్మపురి : అవినీతి అనే చెల్లని నాణెనికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బొమ్మా బొరుసు లాంటివని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో బుధవారం నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. అధికార దాహంతో బీజేపీ, కాంగ్రేస్ పార్టీల నాయకులు తెలంగాణ సర్కార్పై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుంటే కాళ్లలో కట్టెలు పెట్టినట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని నిప్పులు చెరిగారు. పేదలకు ఇచ్చే పెన్షన్లపై కూడా కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో ఆసరా పెన్షన్లతో పాటు ప్రజారంజక పథకాలను అమలు చేసితీరుతామని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో పేదరికం పోయేంత వరకు ఆసరా పథకం అమలు జరగాలనేది సీఎం కేసీఆర్ పట్టుదల అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న నాణ్యమైన ఉచిత కరెంటు సరాఫరాపై కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ర్టాలు విద్యుత్ కొనుగోలు చేయవద్దని బిల్లు తీసుకువచ్చే ఆలోచనలో కేంద్రం ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రంలో 24 గంటల కరెంటును నిలిపివేయాలనే కుట్ర దాగి ఉందన్నారు. నా ప్రాణం పోయిన సరే మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారని గుర్తు చేశారు. కేంద్ర సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాలపై తండ్రి పాత్ర పోషించాల్సింది పోయి, రాష్ట్ర అభివృద్దిని చూసి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ నిర్మాణ, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుతున్న సీఎం కేసీఆర్కు మన మద్దతు తెలపాలన్నారు. భవిష్యత్తులో ఎన్నికల యుద్దం వచ్చినప్పుడు బీజేపీ, కాంగ్రేస్ పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపి, కాంగ్రేస్ నాయకులు ఇంటికి వస్తే సంక్షేమపథకాలు, అభివృద్ది గురించి వివరిస్తూ.. వారిని తరిమి తరిమి కొట్టాలని పిలుపుచిచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని మొన్న వరంగల్లో రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధరణి వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతందని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డా.శ్రీకాంత్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ రాజేశ్కుమార్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, మండల ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీఓ ప్రవీణ్, మున్సిపల్ కమీషనర్ రమేశ్, కోఆప్షన్ సభ్యులు కైసర్, కౌన్సిలర్లు తదితరులున్నారు.