Minister Koppula Eshwar | ఇంటర్ వార్షిక ఫలితాల్లో గురుకులాలు దుమ్ములేపాయి. గురుకుల కాలేజీల్లో (TSRJC) ఏకంగా 92శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 63శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. దాదాపు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు అంతకుమించి ఫలితాలు నమోదు చేశాయి. గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తాచాటడంపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రైవేట్ను మించి ఉత్తీర్ణత సాధించడం విద్యారంగంపై సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని చెప్పారు.
అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనబరిచేందుకు ప్రోత్సహించిన బోధన సిబ్బందిని అభినందించారు. ఇప్పటికే గురుకుల విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తుండగా.. మరికొందరు ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందారని మంత్రి గుర్తు చేశారు. ఈ ఫలితాలు చూసి మరింత మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివించేందుకు ముందుకు రావాలన్నారు. పదో తరగతి ఫలితాల్లోను మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.