న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ప్రగతిని కోరాల్సిన ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అంబేద్కర్ విగ్రహాల పరిశీలనలో భాగంగా ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడుతూ.. తమ హయాంలో రాష్ట్రాలను ఎలాంటి సమస్యలు లేకుండా విభజించామని ప్రధాని చెప్పారని, మరి 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు.
విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. విభజన హామీలను పరిష్కరించకుండా ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు అని మంత్రి చెప్పారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పాటు జరిగింది కాబట్టి.. బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అన్నారు. ఈ ఏడాది చివరినాటికి హైదరాబాద్లో బాబాసాహెబ్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.
రాజ్యాంగం విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు చాలాసార్లు రాజ్యాంగ సవరణ జరిగిందని, రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్న క్రమంలో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పారన్నారు. రిజర్వేషన్లు మార్చాలని ఎక్కడా అనలేదని వెల్లడించారు. కావాలనే కొన్ని పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు.