జగిత్యాల: అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, 12 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మంత్రి వీడియో కాన్పరెన్సు ద్వారా అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారని మంత్రి తెలిపారు. సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే మంచిది కాదని గుర్తించిన ప్రభుత్వం గత 7 సంవత్సరాల్లో తెలంగాణకు హరితహారం పేరిట 2 కోట్ల 48 లక్షల మొక్కలు నాటిందని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందని అన్నారు.
పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమాయకమైన గిరిజనులు, ఇతర వర్గాలకు చెందిన పేదలకు నష్టం జరగకుండా, అదే సమయంలో భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వారు దుర్వినియోగం చేయకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనలు చేశారు. అడవుల సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతోపాటు పార్టీలకతీతంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై సహకరించాలని మంత్రి కోరారు.
హరితహారంలో భాగంగా సామాజికంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా ఒక అడవితో సమానం కాదని చెప్పారు. 10 ఎకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమని, దీనిని గుర్తించిన ప్రభుత్వం అడవులను పునరుజ్జీవిం చేసే దిశగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,347 కోట్లు ఖర్చు చేసి 10.63 లక్షల ఎకరాల్లో 42 కోట్ల 41 లక్షల మొక్కలు నాటి అటవీ పునరుజ్జీవనం చేశామని మంత్రి తెలిపారు.
అడవులను విధ్వంసం చేసే వారిని గుర్తించి వారిపై కఠినంగా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని, ఇక ముందు భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని జిల్లా ఎస్పీని మంత్రి ఆదేశించారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 96,679 మంది పోడు రైతులకు 3,08,614 ఎకరాల భూమి ఆర్ఒఎఫ్ఆర్ పట్టాలను ప్రభుత్వం అందించిందని, ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మరో 7,23,629 ఎకరాల అటవీ భూమిలో 1,99,354 మంది పోడు సాగు చేస్తున్నారని చెప్పారు.
జగిత్యాల జిల్లాలో ఆక్రమణకు గురైన అటవీ భూములలో మరొక్కసారి రీసర్వే చేసి ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతుల పూర్తి వివరాలు సేకరించాలని, భూ కబ్జాదారులు, రియల్ స్టేట్ చేసే వారిని గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అటవీ ప్రాంతాలు ఉన్న ప్రతి గ్రామంలో అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
నవంబర్ మాసంలో పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరుల నుండి క్లెయిమ్స్ స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను గుర్తించి వారికి పట్టాలు పంపిణీ చేస్తామని, పట్టాలు ధృవీకరించే సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కరించిన తరువాత గ్రామంలో మరొక్క అంగుళం అటవీ భూమి కూడా ఆక్రమణలకు గురికాకుండా సంబంధిత గ్రామ సభ తీర్మానించాలని మంత్రి తెలిపారు.
అడవి లోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయిస్తామని, ప్రభుత్వ భూములు లేని పక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయిస్తామని తెలిపారు. జిల్లాలో పోడు సాగుకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసిన తరువాత మిగిలిన అటవీ భూమిని పకడ్బందీగా సంరక్షించుకోవాలని తెలిపారు. అటవీ సరిహద్దు ఏర్పాటు చేసి ఉపాధి హామీ నిధులు, అటవీ నిధులు సంయుక్తంగా వినియోగిస్తూ చుట్టూ ప్రహారీ గోడలు, ట్రెంచ్లు నిర్మించాలని కలెక్టర్కు సూచనలు చేశారు.
జగిత్యాల ఎంఎల్ఏ డా. సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత, జిల్లా కలెక్టర్ జి.రవి, జిల్లా ఎస్పీ సింధుశర్మ, ఎమ్మెల్యేలు, డిఎఫ్ఓ వెంకటేశ్వరరావు, 12 మండలాల జెడ్పిటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రాజకీయ పార్టీల నుండి రవీందర్ రెడ్డి(బీజేపీ), వి.లక్ష్మణ్ కుమార్(కాంగ్రెస్), రాజనర్సు(టి.డి.పి), తిరుపతి( సీపీఎం), శివకుమార్ (వైఎస్ఆర్సీపీ)లు ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.