జగిత్యాల : రాష్ట్రంలోని పేదలు ఆత్మ గౌరవం తో డబుల్ బెడ్ రూం ఇండ్లలో జీవించాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula) అన్నారు. జగిత్యాల జిల్లా(Jagtial District ) పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను(Double bed room) ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి (Gruha Laxmi)పథకం ద్వారా ఇండ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్(CM KCR) ఆర్థిక సహాయం అందజేయనున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం పకడ్బందీ కార్యచరణను అమలు చేస్తుందని పేర్కొన్నారు.
హరితహారం ద్వారా పచ్చదనం పెరిగిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని దుయ్యబట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయకుండా ఇబ్బందులపాలుకు గురిచేసిందని ఆరోపించారు. గ్రామాలకు వచ్చే బీజేపీ నాయకులను ఈ విషయంలో నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంటే, కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తుందని మండిపడ్డారు.కృష్ణా, గోదావరి నదుల పై లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వాటి పై పెత్తనం చెలాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.