Konda Surekha | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : ‘ఒక్కొక్కరూ పది ఓట్లు వేసైనా సరే.. మన అభ్యర్థిని గెలిపించాలని’ పార్టీ కాడర్కు, బీసీ వర్గాలకు మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కులాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆమె చేసిన ప్రసంగంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డిని తొలగించాలని, రేవంత్ రెడ్డి, కొండా సురేఖలపై ప్రచారంపై నిషేధం విధించాలని, మెదక్ కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మంత్రి కొండా సురేఖ చేసిన ప్రసంగాలపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రెండు సార్లు ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆమెను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది కూడా. అయినా ఆమె తన ప్రసంగాలను ఆదే విధంగా కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్, కేసీఆర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారు.