హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో, నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single use plastic) వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని తెలిపారు.
అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని పిలుపు నిచ్చారు. తన సెక్రటేరియట్ కార్యాలయంతో పాటు, నివాసంలోనూ వీలైనంతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని ఆమె సూచించారు.