సిరికొండ/భిక్కనూరు/దోమకొండ, మార్చి 21: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను జూపల్లి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్యపడొద్దని, జరిగిన నష్టంపై సర్వే పూర్తి కాగానే ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకుంటుందని చెప్పారు. 69 లక్షల రైతులకు గాను 58 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని వివరించారు.
మిగతా రైతులకు రానున్న రోజుల్లో నగదు బదిలీ చేస్తామని వెల్లడించారు. రైతులు సాగుచేసే పంటలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించే ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ ఒకేదఫాలో పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఆయన వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఉన్నారు.