హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): నీరాతోపాటు కల్లు ఉప ఉత్పత్తులను ప్రోత్సహించి, గీత కార్మికుల జీవనోపాధి పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, పురావస్తు, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల పరిధిలోని కల్లు సొసైటీల ప్రతినిధుల ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్తో కలిసి జూపల్లి పాల్గొన్నారు.
ప్రజలకు కల్తీలేని కల్లును అందించడానికి ఈత, తాటివనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని జూపల్లి చెప్పారు. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా పెంపు విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కల్లుగీత కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కులస్తుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఖిలాస్పూర్, తాటికొండ, సర్వాయిపేట కోటలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ ట్యాంక్బండ్పై త్వరలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, కార్యనిర్వాహకులు టీ ప్రేమ్దాస్గౌడ్, సి.హరిచరణ్గౌడ్, ఎం కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.