సూర్యాపేట, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గిట్టని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిత్యం విషం కక్కుతున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు బీఆర్ఎస్ను తిట్టడం తప్ప మరోటి తెలియదని అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం 25 ఏండ్లుగా బీజేపీ ఏలుబడిలో ఉన్న గుజరాత్తో పోల్చిచూద్దామా అని కిషన్రెడ్డికి సవాల్ విసిరారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకొంటున్న బీజేపీ.. గుజరాత్లో ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. మోదీ అప్పులు తెచ్చి అదానీ, అంబానీలకు కట్టబెడుతుంటే.. తాము ప్రజల కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పారు.
ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదేండ్లలో తెలంగాణలో ఇచ్చినన్ని ఉద్యోగాలు మొత్తం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కలిపి కూడా కల్పించలేకపోయారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి దమ్ముంటే తెలంగాణకు నిధులు తెచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, శవంతో సమానమని, దాన్ని తెలంగాణలో ఎవరూ పట్టించుకోరని అన్నారు. బీజేపీ దుర్మార్గపు సిద్ధాంతాల కారణంగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. కాంగ్రెస్ మీద అభిమానంతో కర్ణాటక ప్రజలు ఓట్లు వేయలేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన నిర్వాకానికి విసిగిన కర్ణాటక ప్రజలు బీజేపీకి పట్టం కడితే.. కమలం పార్టీ అరాచకాలను తట్టుకోలేని అక్కడి ప్రజలు మరోమార్గం లేక తిరిగి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు తెలిపారు.