సూర్యాపేట: మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా మెడికల్ హబ్గా మారిందని జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని వివిధ వైద్య విభాగాల అధిపతులు కొనియాడారు. సీఎం కేసీఆర్తో ఉన్న చనువుతో మంత్రి జగదీశ్రెడ్డి మెడికల్ కళాశాలను నెలకొల్పారని, అందుకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను సాధించారన్నారు. అలాగే, సూర్యాపేట జిల్లా ప్రభుత్వ దవాఖానగా రూపాంతరం చెందిన ఏరియా దవాఖాన స్థానంలో నూతన భవనాన్ని మంజూరు చేయించడం అభినందనీయమన్నారు.
అదే పట్టుదలతో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ను మంజూరు చేయించారని తెలిపారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో శనివారం ఉదయం మంత్రి జగదీశ్రెడ్డి కొత్తగా మంజూరైన తెలంగాణా డయాగ్నోస్టిక్ హబ్కు అవసరమైన స్థల పరిశీలన నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ దండా మురళీధర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శారదతోపాటు అదే కళాశాలలో పనిచేస్తున్న వైద్య విభాగాధిపతులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
మెడికల్ కళాశాల ప్రారంభం అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెరుగుపడ్డ వైద్య సేవలపై చర్చ రాగా, వైద్య విభాగాధిపతులు మాట్లాడారు. మంత్రి జగదీశ్రెడ్డి ఎప్పటికప్పుడు తాను అప్డేట్ అవుతూ తమ వెన్నంటి ఉండి ప్రోత్సహించడం వల్లే వైద్యరంగంలో సూర్యాపేట ముందెన్నడూ లేని పురోగతి సాధించిందన్నారు. ఇక్కడ గుండెపోటుకు సంబంధించిన అత్యంత ఖరీదైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గుండె కింది భాగంలో ఉన్న నాలుగు నాళాల్లో రక్తం గడ్డ కట్టిపోయి గుండెపోటు సంభవించిన రోగిని గంటలోపు దవాఖానకు తరలిస్తే రక్తప్రసరణ పునరుద్ధరణకు ఇక్కడ వైద్యం అందుబాటులో ఉందని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎస్టీఈఎంఐగాగా గుర్తించిన ఈ వ్యాధికి అత్యంత ఖరీదైన మందులు ఇక్కడ లభిస్తున్నాయన్నారు.
2021 ఆగస్టులో అందుబాటులోకి వచ్చిన ఈ మెడిసిస్తో ఇప్పటి వరకు 15 మంది గుండెపోటు రోగులకు ప్రయోజనం కలిగిందని వారు వివరించారు. అలాగే, హెమోఫోలియా వ్యాధిబారినపడిన వారికి సైతం వైద్యం అందించే ప్రక్రియ సూర్యాపేట దవాఖానలో ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు ఉస్మానియా, గాంధీ దవాఖానలకు మాత్రమే పరిమితమైన ఈ వైద్యం సూర్యాపేటలో అందుబాటులోకి తెచ్చామని వైద్య విభాగాధిపతులు చెప్పారు.
వైద్యరంగంపై సీఎం కేసీఆర్ దృష్టి: మంత్రి జగదీశ్రెడ్డి
విద్యుత్, నీటి రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం విద్య, వైద్యరంగాలను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారన్నారు. అందులో భాగమే సూర్యాపేటలో వైద్యరంగంలో సాధించిన విజయాలని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యులకు అందిస్తున్న ఆహారపు ధరలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారిగా రెట్టింపు చేశారని వెల్లడించారు. వైద్యరంగంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను అమలు పరుస్తున్న వైద్య సిబ్బందిని మంత్రి జగదీశ్రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుజాత, పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్రీకాంత్ భట్, తదితరులు పాల్గొన్నారు.