మునుగోడులో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై రోజు రోజుకూ విశ్వసనీయత పెరగడమే ఇందుకు కారణమన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం మండల టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం సాయంత్రం పుట్టపాగలో నిర్వహించారు. మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో శాసనమండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కుమార్, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్చందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గంలో కాషాయ పార్టీ కనుచూపు మేరలో కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాస్తో కూస్తో పోటీ ఇస్తుందన్నారు.
అన్ని సర్వేల్లోనూ టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని తేలిపోయిందని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్కు రాజకీయ జన్మ నిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రస్తుతం ఆ పార్టీ పతనం అంచున చేరడంతో కాంట్రాక్టుల కోసం కాషాయం కండువా కప్పుకున్నారని విమర్శించారు. వారివి మొదటి నుంచి లోఫర్ మాటలు.. బ్రోకర్ దందాలు అని దుయ్యబట్టారు. ఆ బ్రోకర్ దందాల మాదిరిగానే నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ క్యాడర్, లీడర్ను బేరమాడి బీజేపీలోకి తీసుకెళ్లాలి అనుకున్నారని, అది కాస్తా రివర్స్ కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ను మించినోళ్లు భూప్రపంచంలోనే లేరని విమర్శించారు. మూడేండ్లుగా బీజేపీకి కోవర్ట్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీ రహస్యాలను బీజేపీకి మోసిన రాజగోపాల్.. అంతిమంగా కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీలో చేరారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా అన్ని నియోజకవర్గాలకు సరిసమానంగా నిధులు మంజూరు చేసిందని మంత్రి జగదీశ్రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ చందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.