తెలంగాణ ఉచిత విద్యుత్ లక్ష్యాన్ని కేంద్రం దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని రాష్ట్ర విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో ఊహించని విజయాలు సాధించి, ఉచిత విద్యుత్ అందిస్తుంటే కేంద్రం దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలోని టకుమట్ల గ్రామంలో సోమవారం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణాలో సాధ్యమైన ఉచిత విద్యుత్.. దేశంలో ఎందుకు సాధ్యం కాదు? అని ఇతర రాష్ట్రాల రైతులు కేంద్రాన్ని నిలదీస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్లో విద్యుత్ అందించలేక పవర్ హాలిడే ప్రకటించారని తెలిపారు. తెలంగాణలో నిరాటంకంగా అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ అందిస్తుంటే కేంద్రం కళ్లు మండుతున్నాయని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణపై కేంద్రం కుట్రలు చేస్తున్నదన్నారు.
ఏకంగా కేంద్ర మంత్రే రంగంలోకి దిగి తెలంగాణకు కరెంట్ దొరకకుండా చేస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు రుణాలు రాకుండా కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో కరెంటు కొనకుండా కేంద్రం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
కేంద్ర సర్కారు వివిధ అడ్డంకులు సృష్టించి గ్రిడ్ మీద భారం పడేలా చేస్తున్నదని, విద్యుత్ పంపిణీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నదని చెప్పారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ ఆగదని మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు.