సూర్యాపేట : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని , యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ యస్ మండలం కంద గట్ల, గట్టికల్లు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతమయ్యాయని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా7,031 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకుగాను 1131 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించారని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించారు. అత్యధికంగా నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలో నుంచి సేకరించినట్లు తెలిపారు.
ధాన్యం సేకరణకు అవసరమయ్యే గన్నీ బ్యాగులు(Gunny bags), మాయిశ్చర్ మిషన్లు(Moisture Machines), వేయింగ్ మిషన్ల(Weighing Machines)తో పాటు హమాలీలను సమకూర్చేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, ఎంపీపీ మర్ల స్వర్ణలతా చంద్రారెడ్డి పాల్గొన్నారు.