ఆలేరు టౌన్ , ఆగస్టు 7 : అబద్ధ్దాలకు కేరాఫ్ అడ్రస్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అని మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఆలేరును 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలేరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలేరు నియోజకర్గం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి, ప్రగతి సాధించిందని చెప్పారు. సాగు, తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం మౌలిక వసతులు, కుల వృత్తులను ఆదుకొని అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడు ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించారు. ఆలేరులో అండర్ పాస్ నిర్మాణానికి రూ.6.5 కోట్లు, మున్సిపల్ నూతన భవనానికి రూ.3 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ.2 కోట్లు, వివిధ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.3.5 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.15 కోట్లు మాజీ పురపాలక మంత్రి కేటీఆర్తో ద్వారా మంజూరు చేయించానని చెప్పారు. కుర్చీ వేసుకొని 100 రోజుల్లో రైల్వే అండర్ పాస్ పూర్తి చేస్తామని చెప్పిన బీర్ల అయిలయ్య రెండున్నర ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ అండ్పాస్ ప్రారభించకపోవడం శోచనీయమన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ గ్రామాల సౌలభ్యం కోసం నియోజకవర్గంలోని వివిధ మండలాలను కలుపుతూ రాయిగిరి నుంచి కప్రాయిపల్లి వరకు 35 కిలో మీటర్లు డబ్బుల్ రోడ్డు, వంగపల్లి నుంచి మోత్కూర్ వరకు, ఆలేరు నుంచి గుండాల మోత్కుర్ వరకు, ఆలేరు నుంచి రఘనాథపురం వరకు, యాదగిరిగుట్ట నుంచి రాజపేట వరకు, యాదగిరిగుట్ట నుంచి బొమ్మాలరామారం వరకు నిర్మించిన డబ్బుల్ రోడ్లు బీర్ల అయిలయ్యకు కన్పించడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సహకారంతో ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీ 433 సీట్లతో మంజూరు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తరలించుకు వెళ్లారని తెలియడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో మాట్లాడి ఉన్న 433 సీట్లలో 220 సీట్లకు కుదించారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో ఆలేరు అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయిని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ హామీల అమలుకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, పుట్ట మల్లేశం గౌడ్, కౌన్సిలర్లు బీజన కల్యాణి మధు, పాకాల మౌనిక హరీశ్, మహిళా నాయకులు సీస మహేశ్వరి, కవిత, టంగుటూరు సర్పంచ్ జూకంటి అనిల్, బొందుగుల మాజీ సర్పంచ్ జూలుకుంట్ల రామ్గోపాల్రెడ్డి, బేదరబోయిన యాకమ్మ, బింగిరవి, జల్లి నర్సింహులు, పంతం కృష్ణ, కుండే సంపత్, వెంకటేశ్, పరిదే సంపత్, బేతి రాములు, ఎండీ ఫయాజ్ పాల్గొన్నారు.