హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇప్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతంచేసింది. ఆయా ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి మరీ తమ పరిధిలోని సిబ్బందికి తొలిడోస్ వేయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శుక్రవారం వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది టీకా తీసుకోవాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్రంట్లైన్ వారియర్లతో సమానంగా అడవుల రక్షణకు నిరంతరం విధినిర్వహణలో ఉంటున్నవారు వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు టీకా పంపిణీ కార్యక్రమాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ప్రతి డిపో నుంచి రోజుకు 70 నుంచి 80 మంది చొప్పున వెయ్యి కేంద్రాల్లో టీకా వేయించనున్నట్టు ఆయన తెలిపారు.
45 ఏండ్లు నిండిన 28 వేలమంది ఉద్యోగులకు నాలుగు రోజుల్లో టీకావేసే ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. హోంగార్డులు సహా పోలీస్శాఖలోని 95 శాతం సిబ్బందికి వారంరోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయించాలని ఉన్నతాధికారులను డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. టీఎస్ఎస్పీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, సీఐడీ, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి విభాగాల సిబ్బందికి సైతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సూచించారు. 14లోగా గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధులందరికీ టీకా వేయాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్, సెర్ప్, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకూ టీకా వేయనున్నారు. శుక్రవారం పంచాయతీరాజ్శాఖ కార్యాలయం నుంచి వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘనందన్రావు కలిసి జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జడ్పీ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, వార్డు సభ్యులందరికీ 14వ తేదీ నాటికి వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని శ్రీనివాసరావు చె ప్పారు. జీహెచ్ఎంసీలోని ఉద్యోగులందరికీ ఈ నెల 15 వరకు టీకా వేయడం పూర్తిచేయాలని ఉన్నతాధికారులు లక్ష్యం గా పెట్టుకున్నారు. అన్ని విభాగాల్లో 9 లక్షల పైచిలుకు ఉద్యోగులకు టీకా వేయనున్నారు. కరోనాపై పోరులో ముందుండి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్లు వ్యాక్సినేషన్లో వెనుకబడ్డారు. టీకా తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు 35 శాతంమంది ఫ్రంట్లైన్ వారియర్లకే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు.
త్వరలో మరో 4 లక్షల డోసులు
రాష్ర్టానికి మూడురోజుల్లో మరో 4 లక్షల కరోనా టీకా డోసులు రానున్నాయి. ఇప్పటివరకు వివిధ దశల్లో మొత్తం 25 లక్షల కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులు చేరుకున్నాయి. ఇందులో 18 లక్షల డోసులను పంపిణీచేశారు. మరో 7 రోజులకు సరిపడా 7 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్రం నుంచి డోసుల పంపిణీ నత్తనడకన సాగుతున్నదని, పలు రాష్ర్టాలకు సరఫరాలో వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు డోసులను అతి తక్కువగా పంపిణీచేయడం సరికాదని పలువురు వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు.