ప్రాణాలను సైతం లెకచేయకుండా కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సాగునీటి వనరులు పెంచి నేడు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు.
అత్యధిక ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు గోడు తీర్చేందుకు మిషన్ భగీరథను ప్రారంభించి, ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించారని, ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టారని చెప్పారు. రాబోయే రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి, మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నట్టు తెలిపారు. డబ్బుతో రాజకీయం చేసే వాళ్లను నమ్మకూడదని ప్రజలకు సూచించారు. మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని మరోసారి గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు.