నల్గొండ: గులాబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. రెస్క్యూ టీం లను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు సంభవించకుండా విద్యుత్ శాఖాధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గులాబ్ తుఫాను రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కలెక్టర్లతో మంత్రి జగదీష్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గులాబ్ తుఫాన్ తీవ్రత పెరిగి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఆయన సమీక్షించారు. ప్రమాదకరంగా ఉండే లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు.
వర్షాల వల్ల ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకునేలా విద్యుత్ శాఖను అలెర్ట్ చేయాలని కలెక్టర్లకు చెప్పారు. అదే సమయంలో వైద్య ఆరోగ్యశాఖతో పాటు రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.