హుజూర్నగర్ : ఉద్యోగార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చిత్తశుద్ధితో పనిచేసి కొలువుల సాధించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ లో అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్ధులకు అందిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ను మంత్రి జగదీశ్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృషి, పట్టుదల, ఓర్పుతో గమ్యాన్ని చేరుకోవాలన్నారు.
సెల్ ఫోన్, నిద్ర ,అలసత్వం, వాయిదా లాంటి శత్రువులను జయిస్తే లక్ష్యం చేరువ అవుతుందన్నారు. చదువు ఉద్యోగం కొరకు కాదని జీవితంలో ముందుకు సాగడానికి విద్యార్థుల సాధనంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా, జీవితం అయిపోయిందని తొందరపడి ఆత్మహత్యలు లాంటివి చేసుకోవద్దన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా 5 శాతానికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు లేవని తెలిపారు.
తల్లిదండ్రుల పట్ల గౌరవంగా మెలుగుతూ జీవితంలో ఎంచుకున్న మార్గంలో కాదు, ఒక ఆయుధంగా ఎంచుకొని ఉద్యోగార్థులు విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జెడ్పీ చైర్మన్ దీపిక, మున్సిపల్ చైర్పర్సన్ గిల్లీ అర్చన, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.