బడ్జెట్ సమావేశాలను అడ్డుకొంటే చూస్తూ ఊరుకోవాలా?
బీజేపీ ఎమ్మెల్యేలపై విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్
సూర్యాపేట, మార్చి 8 : ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేదిపోయి బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకొంటే స్పీకర్ చూస్తూ ఊరుకోవాలా? అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. తప్పు చేసింది వారేనని.. వారు కోర్టుకు వెళ్తారో లేక కొండే ఎక్కుతారో వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. మంగళవారం సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. 70 ఏండ్లుగా పార్లమెంట్, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయని.. ఏ సభ్యు లు ఎలా ప్రవర్తిస్తున్నారు, సభా సంప్రదాయాల మేరకు స్పీకర్ సభ ఎలా నడుపుతారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణలో కనీస బాధ్యత లేని ప్రతిపక్షాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. గతంలో వారి పరిపాలనా సమయంలో వదిలిపెట్టిన సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తుండటంతో రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వెంట నడుస్తున్నారని స్పష్టంచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకొని, అసెంబ్లీ సమావేశాలను ఆటంకపర్చే కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభను ఆటంకపర్చితే స్పీకర్ తన హక్కులను వినియోగించక తప్పదని మంత్రి జగదీశ్రెడ్డి గుర్తుచేశారు.