Jagadish Reddy | సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 69.40 శాతం విద్యుత్ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించిన అద్భుతం విద్యుత్ రంగంలో విజయాలు అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ విద్యుత్ విజయోత్సవం సంబురాలను సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని వట్టిఖమ్మం పహాడ్ సబ్స్టేషన్లో నిర్వహించారు. ఈ వేడుకలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రాష్ట్రం ఏర్పాటుతో చీకట్లు మాయం అయ్యాయని, ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్దే అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో నిండు సభలో నాటి పాలకులు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మగ్గుతారంటూ తెలంగాణ సమాజంలో గుబులు పుట్టించిన వారే చీకట్లోకి పోయారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిన రోజున కేవలం 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉండే. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలతో ఆ ఉత్పత్తి 18,567 మెగావాట్లకు చేరుకుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి ఇది నిదర్శనమన్నారు.
ఉమ్మడి అంధ్రప్రదేశ్లో పీక్ డిమాండ్ సమయంలో 13,000 మెగావాట్లు ఉండగా ఇప్పుడు ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే పీక్ డిమాండ్ సమయంలో నమోదు అయిన 14,700 మెగావాట్లే విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతికి అద్దం పడుతుందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ భారతదేశం నుండి తెలంగాణకు విద్యుత్ ట్రాన్స్మిషన్కు తగిన వెసులుబాటు ఉందని ఆయన తెలిపారు. 2014కు పూర్వం ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేక పోయారు. అది ఇప్పుడు ఎలా సాధ్యం అయిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంక్షోభంతో ఎండిపోయిన పంట పొలాలను చూసి తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. అలాంటి దుర్బర పరిస్థితుల నుండి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేదాక చేరుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 9 ఏండ్లలో సాధించిన అభివృద్ధి ఏమిటని విమర్శలు చేసే వారికి విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు చెంపపెట్టు లాంటిదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.