సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రిజగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. 317 జీవో తెచ్చిందే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసమని ఆయన తెలిపారు. దీంతో లబ్ధి పొందేది నిరుద్యోగ యువతీ, యువకులేనని పేర్కొన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి తల్లి దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ స్మారకార్థం యస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు తన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ, కొద్ది కాలంగా పోలీస్ కానిస్టేబుల్స్తోపాటు వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు సూర్యాపేట కేంద్రంగా యస్ ఫౌండేషన్ మెటీరియల్ అందించి, అన్ని వసతులతో శిక్షణ అందిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉద్యోగాలకు పోటీపడే నిరుద్యోగులకు యస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పోటీ పరీక్షలకు హాజరు కాబోయే 1700 మందికి పై చిలుకు యువతీ, యువకులు ఈ శిక్షణా తరగతులకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ శిక్షణా తరగతులను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.