సూర్యాపేట: రాష్ట్రంలో ప్రతీ మహిళా ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఇందులోభాగంగా తీసుకువచ్చిన ఆరోగ్య మహిళ (Arogya Mahila) పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్య మహిళ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళ ఆరోగ్యమే ఇంటికి సౌభాగ్యం అని నమ్మే నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
ఆరోగ్య మహిళ కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. మహిళల సంక్షేమ కోసం ఆరోగ్య లక్ష్మి (Arogya Lakshmi), కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), కేసీఆర్ కిట్ (KCR Kit) వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ (She Team) ఏర్పాటు చేశామన్నారు. మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఆడబిడ్డలకు నీటి కష్టాలు తీర్చామని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.