సూర్యాపేట : దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని, రాష్ట్రంలోని పల్లెలకు, పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని 25, 39, 9, 36 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
మంచి నాగరిక సమాజం తయారు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం వయసులో తక్కువ అయినా దేశంలో ఉన్నా మిగతా అన్ని రాష్ట్రాల్లోకెల్లా అభివృద్ధిలో ఒకడుగు ముందే ఉందన్నారు. పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ వైకుంఠ ధామాలు, పట్టణ ప్రకృతి వనాలు, ప్రతి నిత్యం మంచినీరు అందించే సురక్షితమైన మంచినీటి పథకాలు ఉన్నాయన్నారు.
అన్నింటికి మించి హరితహారంతో తెలంగాణలో పచ్చదనం పరుచుకుందన్నారు.
దేశంలోని ఇరవై గ్రామాల్లో ఏవి బాగున్నాయని లెక్కతీస్తే తెలంగాణలో 19 గ్రామాలు ఉంటాయన్నారు. తెలంగాణ అభివృద్ధిని దాచిపెడదామని కనపడనీయకుండా చేద్దామని ప్రయత్నించే వాళ్లు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితిలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు.
తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ప్రతి పథకం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.