సూర్యాపేట : నాగరిక సమాజానికి విద్యనే గీటురాయి అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దీపం చీకటిని పారద్రోలి వెలుగులు అందించిన చందంగానే విద్య మనిషి జీవితంలో వెలుగులు నింపుతుందని ఆయన స్పష్టం చేశారు. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ వంటి నిచ్చెన మెట్లతో భారతదేశంలో ప్రజలను విద్యకు దూరం చేశారని ఆయన తెలిపారు.
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్ మండలం అనాజీపురంలోని కందుకూరి లక్ష్మమ్మ-పుల్లారెడ్డి మెమోరియల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో దివంగత కందుకూరి లక్ష్మమ్మ-పుల్లారెడ్డి ల జ్ఞాపకార్థం వారి కుమారుడు కందుకూరి నిర్మల ప్రతాప్ రెడ్డి, మేనల్లుడు మలిగిరెడ్డి సుధా అర్జున్ రెడ్డి ఏర్పాటు చేసిన కళావేదికను మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కందుకూరి లక్ష్మమ్మ-పుల్లారెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి నిరోధకులు ప్రజలను విద్యకు దూరం చేసిన ఫలితమే మనుషుల మధ్యన అంతరాలు పెరిగి దేశం మీదకు శత్రు దేశాలు దండయాత్రలు చేసి వందల ఏండ్లు పాలించారని ఆయన చెప్పుకొచ్చారు. దానిని గుర్తించిన మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నన్నారు. విద్యకున్న ప్రాముక్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించిన మీదటనే తెలంగాణా రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి అద్భుతమైన ఫలితాలు రా రాబడుతున్నామన్నారు.
ఇక్కడి పాఠశాలకు ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు వారి వారి పూర్వీకుల జ్ఞాపకార్థం ఈ తరహా అభివృద్ధికి ముందుకు వచ్చిన దాతలు కందుకూరి నిర్మల ప్రతాప్ రెడ్డి,మలిగిరెడ్డి సుధా అర్జున్ రెడ్డి లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి మాజీ డైరెక్టర్ ఒంటెద్దు నరసింహా రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల హెడ్ మాస్టర్ నంగురి యుగందర్ఎ, స్ఎంఎస్ చైర్మన్ తక్కెళ్లపల్లి సునీత తదితరులు పాల్గొన్నారు.