సూర్యాపేట : దేశానికి బీజేపీ ప్రమాదకరమైతే అత్యంత ప్రమాదకరం ఆర్ఎస్ఎస్ భావజాలమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు. సూర్యాపేట మండలం రాయినిగూడెం గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం(Mallu Swarajyam) ప్రథమ వర్ధంతి సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం చిత్ర పటానికి సీపీఎం నాయకుడు (CPM Leader) బీవీ రాఘవులుతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఆడవారు అబలలు కాదు సబలని నిరూపించిన యోధురాలు మల్లు స్వరాజ్యమని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలను, అరాచకాలను ఎదురించడంలో స్వరాజ్యం చూపిన తెగువ ఎనలేనిది కొనియాడారు. నేటి యువతరానికి ఆమె లాంటి యోధుల జీవితాలు స్ఫూర్తి అన్నారు.
నేటి యువతను చూస్తే బాధ కలుగుతుందని, టెక్నాలజీ(Technology) మోజు లో పడి రాజకీయాలకు దూరం కావడమే కాకుండా, ప్రశ్నించే మనస్తత్వాన్ని కూడా కోల్పోతున్నారని అన్నారు. అది దేశానికి చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో పేదలు మరింత పేదలుగా మారుతునన్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రధాని అయ్యాక అభివృద్ధి సూచీ లో దేశం మరింత దిగజారిందని విమర్శించారు. కేవలం ఆదానీ(Adani), అంబానీ(Ambani) ల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేయబోయే పోరాటం లో వెన్నుదన్ను గా నిలబడాలని సభికులను కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నేతలు రాఘవులు, నంద్యాల నరసింహా రెడ్డి, చేరుపల్లి సీతారాములు,జూలకంటి రంగారెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.