Jagadish Reddy | నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ తొమ్మిదేండ్ల కాలంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలు అమలు చేస్తూ అన్ని రంగాల్లో రాష్ట్రం అధ్భుత ప్రగతి సాధించింది అగ్ర భాగాన నిలిచిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన విజయాలను, ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరి సహకారంతో భాగస్వామ్యులను గ్రామ, పట్టణ స్థాయిలో చేస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విషయమై నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ తన అద్భుతమైన పరిపాలనతో అనేక రంగాల్లో విజయాలు సాధించిందన్నారు. వ్యవసాయ రంగంలో రైతాంగానికి విశ్వాసం కలిగించారని, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించామని, తలసరి ఆదాయంలో దేశంలో రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని మంత్రి గుర్తు చేశారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో ఎక్కువ లాభపడిన జిల్లా నల్లగొండ జిల్లా అని జగదీశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసిన ఉమ్మడి జిల్లా గత 4 సంవత్సరాలుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని అన్నారు.
అన్ని రంగాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంతో ప్రగతిని సాధించడం జరిగిందని, ఉపాధితో పాటు, ఉద్యోగం, వ్యవసాయం, వైద్యంలో, శాంతిభద్రతలు, పారిశ్రామిక రంగం, వ్యవసాయం ఇలా ఒకటేమిటి అన్నిరంగాలు అభివృద్ధిలో ముందున్నాయని తెలిపారు.
గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని అన్ని శాఖలు నివేదికల రూపంలో తయారు చేయాలని, ఈ సమాచారం మొత్తం జూన్ 2వ తేదీ లోపు ప్రజాప్రతినిధులందరికీ సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ రైతు దినోత్సవం మొదలుకొని జూన్ 22న నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కవులను, సత్కరించాలని, తెలంగాణ గిరిజన ఉత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులను పిలిచి కార్యక్రమాలు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నిర్వహించాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు.