Minister jagadish Reddy | నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విధి, విధానాలతో పాటు నిధులు విడుదల చేసేది రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ ఆచరణలో అమలుపరిచేది మాత్రం ప్రభుత్వ ఉద్యోగులేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున యావత్ భారతదేశంలోనే రోల్ మోడల్గా నిలిచింది అంటే అందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ప్రధానంగా ఉందని ఆయన ప్రశంసించారు.
శనివారం నల్లగొండ( Nallagonda ) జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఎన్జీవో( TNGO ) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. వాటితో పాటుగా అంగన్వాడి టీచర్స్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్లను కూడా మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.
ప్రజల మదిలో తెలంగాణ పదాన్ని ఒక శ్వాసగా మార్చింది టీఎన్జీవో ఉద్యోగులు అని ఆయన కొనియాడారు. 75 సంవత్సరాలుగా తెలంగాణ అస్తిత్వాన్నీ నిలబెట్టిన ఘనత కుడా టీఎన్జీవోలకే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లావాత్మక మార్పులు తెచ్చిందన్నారు. పట్టణాలకే ఆ మార్పులు పరిమితం చెయ్యకుండా చివరి అంచు వరకు తీసుకపోవడంలో ఉద్యోగులు అందించిన సహకారం మరిచిపోలేనిదని పేర్కొన్నారు. మోదీ మాయాజాలం బట్టబయలు అయిందన్నారు. అనుచరులకు ప్రభుత్వ సొమ్ము రూ. 19 లక్షల కోట్లు ధారాదత్తం చేయడమే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. పేదోడిని కొట్టి పెద్దోడికి పెట్టె విధంగా మోదీ చర్యలు ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. అటువంటి మోదీ సర్కార్ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు అవరోధాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రుణమాఫీ పథకం కింద రూ. 26 వేల కోట్లు, రైతుబందు పథకం కింద రూ. 60 వేల కోట్లు,ఆసరా ఫించన్ల కింద రూ. 15 వేల కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక పోతుందన్నారు. అది కేంద్రానికి కంటగింపుగా మారి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయకుండా అడ్డు పడుతుందని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
సంపద సృష్టించాలి పేదలకు పంచాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అయితే బ్యాంకులను ఒక్కటి చేయాలి.. ఎల్ఐసీని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయాలన్నది ప్రధాని మోదీ సంకల్పం అని ఆయన విమర్శించారు. అటువంటి మోదీ పాలనలో మొట్టమొదలు నష్టపోయిందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అని పేర్కొన్నారు. అటువంటి కేంద్ర ప్రభుత్వ చర్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్బోధించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.