సూర్యాపేట: తెలంగాణ (Telangana) కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో (MP Lingaiah Yadav) కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి జగదీశ్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో సార్ పాత్ర మరవలేనిదన్నారు. 1952లో జయశంకర్ సార్ నాన్ ముల్కీ ఉద్యమంలో, తర్వాత ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు.
ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్ సార్ అని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు సార్ కల అని.. సీఎం కేసీఆర్ (CM KCR) దానిని నిజం చేసిచూపించారని ప్రశంసించారు.