రాష్ట్రంపై మోడీ సర్కార్ ద్రోహానికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఢిల్లీ లెవల్లో వ్యూహాలు సన్నద్ధం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఐదవ విడత పల్లెప్రగతిలో బాగంగా నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని కనగల్ మండలం దరవేశిపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మనఊరు-మనబడిలో బాగంగా రూ.24 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన పాఠశాల అభివృద్ధి పనులతో పాటు రూ.3.66 లక్షలతో నిర్మించ తలపెట్టిన బిటి రోడ్ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టియస్డబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి,కనగల్ యంపిపి కరీం పాషా, జడ్పిటిసి చిట్ల లింగయ్య, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్పై బూత్ లెవల్ నాయకులు బూత్ బాషలో మాట్లాడుతుంటే ఎదో బూత్ లెవల్ నాయకులు వారికి అంతకు మించి అవగాహన ఉండదనుకున్నామని కానీ ఇప్పుడు ప్రధాని మోడీ, అమిత్ షాలు మాట్లాడడమే కేంద్రం కుట్రలకు అద్దం పడుతుందన్నారు. మొన్నటిదాకా పొగిడిన నోళ్లు ఇప్పుడు తూలనాడుతున్నాయన్నారు.
అమిత్ షా స్థాయిలో అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో అల్లూరి సీతారామ రాజు పాల్గొన్నాడని అనడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆయన అమిత్ షా కాదని అబద్ధాల షా అని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో లేనిదని అన్నారు.
ఇదే సభలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 14 ఏళ్ళు అలుపెరుగని పోరాటం చేసి, చావు నోట్లో తల పెట్టి, తెలంగాణను సాధించిన యుగపురుషుడు మన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని ప్రకటించారు. ‘‘ఇవ్వాళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సభండ వర్గాలు ఆనందంగా వున్నారు. మొదటగా అన్నదాతలు బాగుండాలని 24 గంటల కరెంట్ ఇచ్చారు. పుష్కలంగా నీరు అందించారు. విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి అహర్నిశలు కృషి చేసి, నాణ్యమైన కరెంట్ను రైతులకు సరఫరా చేస్తున్నారు’’ అని అన్నారు.
అక్కడితో ఆగకుండా గ్రామాలు కూడా పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టారని ముఖ్యమంత్రి కేసీఆర్ను కొనియాడారు. ‘‘ఇవ్వాళ గ్రామాలు పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్ లు, హరితహారం చెట్లు, వైకుంఠ దామాలతో అందంగా తయారయ్యాయి. నల్గొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రూ.70 లక్షల తో సీసీ రోడ్లు నిర్మించినం. ద్వరేషిపురం గ్రామం మీదుగా తేలేకుంటోని గుడం గ్రామం వరకు మూడుకోట్ల 65 లక్షల రూపాయలతో బీటీ రోడ్డును నిర్మిస్తున్నాం. నల్గొండ జిల్లా కేంద్రం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతున్నది. నల్గొండలో ఐటీ హబ్, మెడికల్ కాలేజీ , ఎన్జీ కాలేజీలను నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు.
విద్య ,మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి కూడా ఈ సందర్బంగా మాట్లాడారు. తెలంగాణలో రూ.7,238 కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్.. మనఉరు-మనబడి కార్యక్రమం చేపట్టి సర్కారు బడులను బాగు చేస్తున్నారని చెప్పారు. ‘‘విడతల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల పాఠశాలలను బాగు చేస్తునం. అన్ని స్కూల్స్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీషు విద్యను అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య దొరుకుతుంది. కల్యాణ లక్ష్మీ పథకం సమాజంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది’’ అని పేర్కొన్నారు.