యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి జగదీశ్ రెడ్డి డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆనాడు సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో మంచి నీళ్లు కూడా సరిగ్గా దొరక్కా తెలంగాణాలో చాలా మంది కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారని గుర్తు చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ సేవల్ని అందించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు.
పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించేలా వైద్య రంగంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది అని స్పష్టం చేశారు. మారుమూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసూతి వైద్యాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మెడికల్ హబ్గా మారిందన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు అందుతున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.